Monday, December 20, 2010

మన మిత్రుడొచ్చాడు

ఇది మూడేళ్ల క్రితం మాట. ఢిల్లీలో అంతర్జాతీయ ట్రేడ్‌ ఫెయిర్‌ జరిగింది. అందులో చైనా ఓ భాగస్వామి దేశం. స్టాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు అది అత్యధిక స్థలాన్ని తీసుకున్నది. అనేక స్టాల్స్‌ను పెట్టింది. భారీగా సరుకులను తీసుకొచ్చింది. మూడంటే మూడే రోజుల్లో వాటన్నింటినీ అమ్మేసింది. నాలుగో రోజు స్టాల్స్‌ అన్నీ ఖాళీ చేసి వెళ్లిపోయింది. అదే ఫెయిర్‌లో మనదేశ పారిశ్రామిక వేత్తలు కూడా పాల్గొన్నారు. స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయిలో సంసిద్ధం కాలేదు. చైనాలాగా పక్కా ప్రణాళికతో కూడా లేరు. మూడేళ్ల తరువాత ఇప్పుడు కూడా అలాంటిదే పునరావృతమైంది. 'మేము భాగస్వాములం, పోటీదార్లం మాత్రం కాము' అంటూ మన దేశానికి చైనా వచ్చింది. ఈ దఫా సరుకుల ఓడ రాలేదు. కానీ భారీ ఒప్పందాలను కుదుర్చుకునేందుకు పెద్ద విమానం నిండా 400 మంది వ్యాపార ప్రతినిధులు వచ్చారు. చైనా ప్రధాని వెన్‌ జియాబావో వారికి నేతృత్వం వహించారు. ఒక్క రోజులో 16 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 45 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒబామా(10బిలియన్‌ డాలర్లు), సర్కోజి(13బిలియన్‌ డాలర్ల) వాణిజ్య ఒప్పందాల రికార్డులను వీరు బద్దలు కొట్టారు. అయితే ఈ దఫా కూడా మన దేశీయ పెట్టుబడిదారులు పూర్తిస్థాయిలో సంసిద్ధం కాలేదు. వెన్‌ వచ్చినప్పుడు ఆయన్ను కలిసేందుకు టాటా రాలేదు. అంబానీ రాలేదు. సునీల్‌ మిట్టల్‌ రాలేదు. నారాయణమూర్తి కూడా లేడు. అయినా చైనీయులు తమ మొహం మీది చిరునవ్వును చెరగనీయలేదు. లక్ష్యం పట్ల విశ్వాసాన్నీ సడలనివ్వలేదు.
వెన్‌ బృందం మన దేశంలోకి స్పష్టమైన ఎజెండాతోనే వచ్చింది. ఇరు దేశాల మధ్య ప్రాంతీయ వాణిజ్య అంగీకారం (ఆర్‌టిఎ), పెట్టుబడికి ప్రోత్సాహం, ఒప్పందాల భద్రత అనేవి ఎజెండాలో కీలకమైనవి. ఆసియాన్‌, ఐరోపా దేశాలతో ప్రమాదకరమైన, అత్యంత గోప్యతగా ఉండే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టిఎ) కుదుర్చుకునేందుకు సిద్ధపడ్డ యుపిఎ-2 చైనాతో ఆర్‌టిఎ విషయంలో మొహం చాటేసింది. స్తబ్ధత ఏర్పడింది. దీనిని నివారించేందుకు 'ఇండో చైనా సిఇఓ ఫోరమ్‌ ఏర్పాటు చేయాల'ని చైనా ప్రతిపాదించింది. దీనిని తరుచుగా సమావేశ పర్చాలని కోరింది. భారత్‌ దీనికి ఒప్పుకుంది. ఈ ఫోరమ్‌లో ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరుగుతాయి. భారత్‌తో ఆర్‌టిఎ కుదుర్చుకునేందుకు ఈ ఫోరమ్‌ ఒక దగ్గరి మార్గంగా చైనా భావించినట్లుంది.

పరస్పర పెట్టుబడుల మార్పిడికి సంబంధించిన అంశంలో కూడా భారీ పురోగతినే సాధించింది. 2.5ట్రిలియన్‌ డాలర్ల విదేశీ మారక మిగులును కలిగిన చైనా మన దేశానికి పెట్టుబడులను తరలిస్తే మౌలిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధిని తీసుకురావచ్చు. అలాగే భారత్‌ నుంచి కూడా తన దేశంలోకి పెట్టుబడులు రావాలని చైనా కోరుకుంటోంది. దీనిని సాధ్యం చేసేందుకు ఆర్‌బిఐ, చైనా రెగ్యులేటరీ కమిషన్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం బ్యాంకులు ఇరు దేశాల్లోనూ బ్రాంచీలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఒప్పందం జరిగిన మరుక్షణమే ఎస్‌బిఐ తన బ్రాంచిని చైనాలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. విదేశాల్లో విస్తృతంగా బ్రాంచీలు కలిగిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా సైతం చైనాలో బ్రాంచీలను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే చైనాకు సంబంధించిన బ్యాంకు ఆఫ్‌ చైనా, ది చైనా కన్‌స్ట్రక్షన్‌బ్యాంకు, ఇండిస్టియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, అగ్రికల్చరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా మనదేశంలో బ్రాంచీలను ఏర్పాటు చేయబోతున్నాయి.

తన దేశంతో కుదుర్చుకోబోయే ఒప్పందాలు అమల్లోకి వచ్చే విధంగా రుణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తానని చైనా ప్రకటించింది. తాజా పర్యటనలో రిలయన్స్‌ పవర్‌తో కుదిరిన ఒప్పందానికి భారీ నిధులు అవసరమవుతాయి. ఆ మొత్తాన్ని రుణంగా ఇస్తానని చైనా ప్రకటించడం ఇక్కడ గమనించాలి. ఈ సౌకర్యాన్ని మనదేశానికి చెందిన అనేక కంపెనీలు ఇప్పటికే అనుభవిస్తూ ఉన్నాయి. ఎస్సార్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వి.అశోక్‌ ఈ అంశంపై స్పందిస్తూ 'మేము భారీ నౌకలు కొనాలనుకున్నాం. చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకు భారీగా ఆర్థిక సహాయం (రుణం) అందించింది. ఈ రుణం మా గ్రూపు ఎదుగు దలలో ప్రధాన పాత్ర పోషించింది. చైనా నుంచి పెద్ద ఎత్తున విద్యుత్‌ ఉత్పత్తి పరికరాలను దిగుమతి చేసుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి సహకారమే లభించింది. ఇప్పుడు మరో నాలుగు నౌకలు కొనేందుకు చైనా ఆర్థిక సాయం అందిస్తానంది. మున్ముందు ఈ సహకారం మరింత పెరిగే అవకాశం ఉంది.' అని అన్నారు. తనతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రతి అవసరమైన కంపెనీకి రుణ సాయాన్ని అందిస్తానని తాజా పర్యటనలో చైనా ప్రకటించింది. మన దేశీయ పారిశ్రామికవేత్తల దృష్టిని తనవైపుకు తిప్పుకోగలిగింది.
పరస్పర వాణిజ్యానికి సంబంధించిన సమస్యను కూడా సానుకూల
దృష్టితో పరిష్కరించేందుకు చైనా ప్రయత్నించింది. భారత్‌, చైనాల మధ్య వాణిజ్యం 1999-2000లో 1.82 బిలియన్‌ డాలర్లుంటే 2009-10నాటికి 42.4బిలియన్‌ డాలర్లకు పెరిగింది. మనదేశం నుంచి చైనాకు ఎగుమతులు 2005-06లో 6.7బిలియన్‌ డాలర్లు ఉండగా, 2009-10లో దాదాపు రెట్టింపు అయి 11.6బిలియన్‌ డాలర్లకు చేరింది. అదే సందర్భంలో దిగుమతులు 10.8బిలియన్‌ డాలర్ల నుంచి మూడు రెట్లు పెరిగి 30.8బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో 19.2బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు ఏర్పడింది. ఇది మనదేశానికి ఇబ్బందిగా పరిణమించింది. దీనిని చైనా కూడా గుర్తించింది. ఈ వాణిజ్యలోటును పూడ్చేందుకు తన దేశంలోని ఐటి, ఫార్మా మార్కెట్లను భారతీయ కంపెనీలకోసం తెరుస్తానని హామీని ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీన ఫార్మా రంగానికి సంబంధించిన ఇండియన్‌ డ్రగ్స్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐడిఎంఎ), చైనా ఫార్మాసుటికల్‌ ఇండిస్టీస్‌ అసోసియేషన్‌ (సిపిఐఎ) మధ్య ఈ విషయంపైనే ఓ ఎంఒయు కుదరబోతోంది. డ్రగ్స్‌, మందుల రిజిస్ట్రేషన్‌, దిగుమతులు, పంపిణీ, నిర్వహణ తదితర అంశాలపై ఈ అవగాహన ఉంటుంది. ఐటి రంగంలోనూ అతి త్వరలో ఇలాంటి అవగాహన కుదరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న 34 వస్తువులపై డంపింగ్‌ నిరోధక చర్యలు తీసుకుంది. ఇది ఇతర ఏ దేశ ఉత్పత్తుల కన్నా ఎక్కువే. డంపింగ్‌ నిరోధక చర్యల పట్ల భారత ప్రభుత్వం తాజాగా ఎలాంటి సానుకూల ప్రకటన చేయలేదు. అదే సందర్భంలో చైనా మాత్రం తన దేశంలో వచ్చి అమ్ముకోండని భారత కంపెనీలకు ఆహ్వానం పలికింది.

కమ్యూనిస్టు దేశం పట్ల సహజసిద్ధంగానే ఉండే వ్యతిరేకతను తగ్గించేందుకు రాజకీయంగా కూడా వెన్‌ చెప్పుకోదగ్గ కృషినే చేశారు. చైనాను మాటిమాటికి బూచిగా చూపెట్టే బిజెపి నేతలతోనూ సమావేశమయ్యారు. వారు అనేక సున్నితమైన అంశాలను ప్రస్తావనకు తెచ్చినప్పుడు వాటన్నింటి చర్చల ద్వారా పరిష్కరించుకుందామన్నారు. మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పాయి ఆరోగ్యం గురించి వాకాబు చేశారు. ప్రధాని హోదాలో ఆయన తమ దేశం పర్యటించినప్పటి అనుభూతులను గుర్తు చేసుకున్నారు. మొత్తానికి ఉల్లాసకర వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. సాంస్కృతికంగానూ ఇరుదేశాల మధ్య బలమైన పునాదులు వేసేందుకు ఉపయోగపడే ఒప్పందాలను ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. నలంద విశ్వవిద్యాలయం కోలుకునేందుకు రూ.4.50లక్షలు ఇస్తానన్నారు. 'డ్రాగన్‌, ఏనుగు పరస్పరం పోరాడుకోవడం కంటే కలిసి నృత్యం చేశాయనే కథలను చిన్న పిల్లలకు చెప్పాల'ంటూ సాంస్కృతి పునాదులు బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు చైనాను విదేశీ భాషాంశంగా సిబిఎస్‌ఇ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టబోతోంది. ఇది వెన్‌ కృషిలో భాగమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

వెన్‌ పర్యటన ఆద్యంతం ఇరుదేశాల మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో సాగింది. అమెరికా పన్నిన వ్యూహాత్మక అణు ఒప్పందంలో భారత్‌ చిక్కుకుని పోవడం, అమెరికాకు జూనియర్‌భాగస్వామిగా మారబోతుండడం అసియా ఖండంలో అశాంతికి హేతువుగా మారబోతోంది. ఈ నేపథ్యంలో శాంతిని కాపాడాలంటే భారత్‌ను తటస్థంగా ఉంచాలన్నది చైనా వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకే కాశ్మీరీయులకు స్టేపుల్‌ వీసాలపై గతంలో లాగా మంకు పట్టు పట్టకుండా 'చర్చించుకుందాం' అని చెప్పింది. పూర్తిస్థాయి ప్రకటన రాలేదు కాబట్టి టిబెట్‌ చైనాలో అంతర్భాగమంటూ చేయబోయే ప్రకటనను భారత్‌ వాయిదా వేసుకుంది. ఇరుదేశాల మధ్య ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా స్థూలంగా చూసినప్పుడు 'వ్యాపార, వాణిజ్యాలకు ప్రతిసారి పశ్చిమం వైపే చూడాల్సిన అవసరం లేదు. మనం పరస్పర ఒప్పందాలు చేసుకుందాం' అనే అభిప్రాయాన్ని కల్పించడంలో వెన్‌ తన పర్యటన ద్వారా కృతాకృత్యుడు కాగలిగారు. కమ్యూనిస్టు దేశంతో రాజకీయంగా అంగీకరించలేకపోయినా దానితో వ్యాపారం చేయాలనుకున్న వారి సంఖ్య మనదేశంలో భారీగానే ఉందని వెన్‌ పర్యటన ద్వారా స్పష్టమైంది. ఇరుగుపొరుగు దేశాల మధ్య మిత్రత్వానికి రాజకీయ కారణాలు అడ్డం కారాదని చైనీయులు భావిస్తున్నట్లుంది. అందుకే భారీ వాణిజ్య ఒప్పందాలతో స్నేహం కోసం అర్రులు చాచారు. మనదేశానికి ఓ మంచి మిత్రునిగా మెలగాలని ప్రయత్నించారు.
జగదీష్‌

No comments:

Post a Comment