Tuesday, December 21, 2010

ధరలు పెంచిన దొంగలెవరు?

హన్నన్నన్న... పొద్దున లేచి వార్తలు చూస్తుంటే దిమ్మ దిరిగిపోయిందనుకో.. సోనియమ్మ ధరలు తగ్గించాలంటది. మన్మోహనేమో ఆకలితో ఏ భారతీయుడూ పడుకోవద్దంటాడు. ఏమైనా చేసి ధరల గొంతు పిసికేయాలని ఆర్‌బిఐకి ప్రణబ్‌ చెబుతున్నాడు.. చూస్తుంటే వీరంతా ధరలపై యుద్ధానికి పోయినట్లే కనిపిస్తుంది. మరి ఇప్పటి దాకా ధరలు పెంచిందెవరు? వీళ్లంతా పోలీసులైతే ఆ దొంగలెవరు? నాకు తెలిసి ధరలు పెంచేది. తగ్గించేది ప్రభుత్వమే. కాంగ్రెస్సోళ్లంతా ఇప్పుడు ఎవరిపై యుద్ధం చేస్తున్నారు? వాళ్లున్నది ప్రభుత్వంలోనా? ప్రతిపక్షంలోనా? ప్రభుత్వం వాళ్లే నడుపుతారు. ప్రతిపక్షం కూడా వాళ్లే. రజినీకాంత్‌ సినిమాలోలాగా హీరో వాళ్లే, విలన్‌ వాళ్లే... ద్విపాత్రాభినయం...
రోబో సినిమాను ఎంజాయ్  చేయొచ్చుగానీ, కాంగ్రెస్‌ ద్విపాత్రాభినాయాన్ని భరించడం కష్టం. పెట్రోలు ఛార్జీలు వాటంతటవే పెరిగిపోయే విధంగా చట్టాన్ని మార్చేశారు. పెట్రోలు ఛార్జీలు మేం పెంచట్లేదని చెబుతున్నారు. రోజుకు 6000 టన్నుల ఉల్లిగడ్డను ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్నారు. సరిగా పండలేదు కాబట్టే ధరలు పెరిగాయని బుకాయిస్తారు. గోడౌన్లలో బియ్యం ఉన్నాయంటారు. ఫ్రీగా పంచాలని సుప్రీంకోర్టు చెప్పినా పంచరు. మీదినుంచి ఆకలితో మాడొద్దంటారు. అన్నింటినీ ప్రయివేటీకరిస్తుంటారు. మరోవైపు ఉపాధికల్పన ఉద్యోగాలు పెంచుతున్నామంటారు. నిండా అవినీతి ఊబిలో కూరుకుపోయారు. అవినీతిపై పోరాటం చేస్తామంటారు. జెపిసి వేయనంటారు. కోరల్లేని పిఎసి ముందుకొచ్చి సచ్చీలత నిరూపించుకుంటానంటారు.
వీళ్లది నాలుకా? తాటిమట్టా? వినేటోడుంటే అడ్డంగా ఎన్నయినా మాట్లాడేస్తుంటారు. జనాల బుర్రల్లోంచి ఫ్యూజును పీకేసి కన్‌ఫ్యూజ్‌ చేసేస్తారు. జనాన్ని పిచ్చోళ్లు, గొర్రెలమందలు అని అనుకుంటున్నారు. ఇవన్నీ తెలుసుకోకపోతే వారు అనుకునేదే నిజమేనేమో!

1 comment:

  1. True!
    ///////////
    Disable Word verification.

    ReplyDelete