Thursday, December 30, 2010

కార్పొరేట్లకు కలిసొచ్చిన 'సంక్షోభం'

2008లో తలెత్తిన ప్రపంచ సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తుంటే ముఖేష్‌ అంబానీ నెదర్లాండ్స్‌కు చెందిన లైయోన్డెల్‌బాసెల్‌ అనే రసాయన కంపెనీని కొనేశారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద రసాయన పరిశ్రమాధిపతిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ రసాయన పరిశ్రమల ఆదాయం 8000 కోట్ల డాలర్లు. రూపాయల్లో 3.60లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌కు మూడున్నర రెట్లు. ఒక్క ముఖేష్‌ అంబానీయే కాదు దేశంలో అత్యంత ధనిక గుత్తాధిపతులందరూ తమ ఆస్తులు విపరీతంగా పెంచుకోవడం, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను కొనడం సంక్షోభానంతర కాలంలో నిరాఘాటంగా కొనసాగించారు. ఈ కోవలోకే అవంతా కూడా వస్తుంది. అవంతా గ్రూపు తన ఉపాంగాల ద్వారా విదేశీ కంపెనీలను విలీనం చేసుకోవడమో, కొనడమో చేసింది. సంక్షోభం ముందు నుంచే ఆరంభించి 2010 చివరి నాటికల్లా బెల్జియం పావెల్స్‌ను, హంగేరియన్‌ గాన్జ్‌ను, ఐర్లాండ్‌ మైక్రోసోల్‌ను, ఫ్రాన్స్‌ను సోనోమాత్రాను, అమెరికాకు చెందిన ఎంఎస్‌ఇ పవర్‌ సిస్టమ్స్‌ను తన గుప్పిట్లోకి...

Tuesday, December 21, 2010

మన్మోహన్‌ పీడ కల

మన్మోహన్‌కి ఒక కల వచ్చిందంట. ఆయన కోర్టులో ఉన్నడంట. బోనులో కూర్చున్నడంట. చేతులకు బేడీలు ఉన్నయంట. బాడీ మీద గీతల చొక్కా ఉందంట. ఆయన పక్కనే సరిగ్గా అట్లనే ఇంకొడున్నడంట. కళ్లు నలిపి చూస్తే, అప్పుడు కనిపించిండంట. టెలికాం కింగంట. 2జికి రాజంట. ఆయన నవ్విండంట. ఈయన ఏడ్చిండంట. ఏరు మన్మోహన్‌ అని ఎవరో పిలిచిన్రంట. మన్మోహన్‌ ఇంకా ఏడ్చిండంట. కేర్‌ మన్నడంట. ఉంగా ఉంగా అన్నడంట. జెపిసి వద్దే అని అంటున్నడంట. ఎక్కిళ్లుపట్టిండంట. మన్మోహన్‌... అని మళ్లీ గట్టిగా ఎవరో పిలిచింరంట. కోర్టు పాయే... బేడీలు పాయే... బోను పాయే... గీతల చొక్కా పాయే... రాజా గాయబాయే... మన్మోహన్‌... అని మళ్లీ పిలిచింరంట. తెల్లగా పాలిపోయిన మొహంతోని సోనియమ్మ కనిపించిందంట. మేడం జెపిసి వద్దు మేడం. కలనే భయంకరంగా ఉంది మేడం. ప్లీజ్‌ మేడం. జెపిసి వద్దు మేడం అని అంటున్నడంట. అప్పుడా మేడం మన్మోహన్‌జీ కలగంటున్నావ్‌. మనం ప్లీనరీలో ఉన్నాం. నువ్వు కునుకు తీసావంతే... చూడు చుట్టు మనోళ్లే ఉన్నారు అని అన్నదంట. మన్మోహన్‌ గట్టిగా ఊపిరి పీల్చుకుని 'కలనే ఇంత భయంకరంగా ఉంది. ఇదే నిజమైతే...?' అని ఆలోచించిండంట. వెంటనే మైకు దగ్గరకి ఉరికి 'ప్రధానిగా ఉన్న నన్ను ఎవ్వరు అనుమానించొద్దు. నేను సచ్చీలుణ్ని కావాలంటే కోరల్లేని  పిఎసి ముందు హాజరయితా, నిజాయితి నిరూపించుకుంటా. మళ్లీ చెబుతున్న జెపిసి మాత్రం వద్దు. జెపిసి మాత్రం వద్దు' అని చెప్పి మళ్లీ సోనియా మేడం దగ్గరబోయి కూసున్నడంట.

ధరలు పెంచిన దొంగలెవరు?

హన్నన్నన్న... పొద్దున లేచి వార్తలు చూస్తుంటే దిమ్మ దిరిగిపోయిందనుకో.. సోనియమ్మ ధరలు తగ్గించాలంటది. మన్మోహనేమో ఆకలితో ఏ భారతీయుడూ పడుకోవద్దంటాడు. ఏమైనా చేసి ధరల గొంతు పిసికేయాలని ఆర్‌బిఐకి ప్రణబ్‌ చెబుతున్నాడు.. చూస్తుంటే వీరంతా ధరలపై యుద్ధానికి పోయినట్లే కనిపిస్తుంది. మరి ఇప్పటి దాకా ధరలు పెంచిందెవరు? వీళ్లంతా పోలీసులైతే ఆ దొంగలెవరు? నాకు తెలిసి ధరలు పెంచేది. తగ్గించేది ప్రభుత్వమే. కాంగ్రెస్సోళ్లంతా ఇప్పుడు ఎవరిపై యుద్ధం చేస్తున్నారు? వాళ్లున్నది ప్రభుత్వంలోనా? ప్రతిపక్షంలోనా? ప్రభుత్వం వాళ్లే నడుపుతారు. ప్రతిపక్షం కూడా వాళ్లే. రజినీకాంత్‌ సినిమాలోలాగా హీరో వాళ్లే, విలన్‌ వాళ్లే... ద్విపాత్రాభినయం...
రోబో సినిమాను ఎంజాయ్  చేయొచ్చుగానీ, కాంగ్రెస్‌ ద్విపాత్రాభినాయాన్ని భరించడం కష్టం. పెట్రోలు ఛార్జీలు వాటంతటవే పెరిగిపోయే విధంగా చట్టాన్ని మార్చేశారు. పెట్రోలు ఛార్జీలు మేం పెంచట్లేదని చెబుతున్నారు. రోజుకు 6000 టన్నుల ఉల్లిగడ్డను ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్నారు. సరిగా పండలేదు కాబట్టే ధరలు పెరిగాయని బుకాయిస్తారు. గోడౌన్లలో బియ్యం ఉన్నాయంటారు. ఫ్రీగా పంచాలని సుప్రీంకోర్టు చెప్పినా పంచరు. మీదినుంచి ఆకలితో మాడొద్దంటారు. అన్నింటినీ ప్రయివేటీకరిస్తుంటారు. మరోవైపు ఉపాధికల్పన ఉద్యోగాలు పెంచుతున్నామంటారు. నిండా అవినీతి ఊబిలో కూరుకుపోయారు. అవినీతిపై పోరాటం చేస్తామంటారు. జెపిసి వేయనంటారు. కోరల్లేని పిఎసి ముందుకొచ్చి సచ్చీలత నిరూపించుకుంటానంటారు.
వీళ్లది నాలుకా? తాటిమట్టా? వినేటోడుంటే అడ్డంగా ఎన్నయినా మాట్లాడేస్తుంటారు. జనాల బుర్రల్లోంచి ఫ్యూజును పీకేసి కన్‌ఫ్యూజ్‌ చేసేస్తారు. జనాన్ని పిచ్చోళ్లు, గొర్రెలమందలు అని అనుకుంటున్నారు. ఇవన్నీ తెలుసుకోకపోతే వారు అనుకునేదే నిజమేనేమో!

Monday, December 20, 2010

బాబు బుర్రలో లైటు వెలిగింది

ఊు... అంటే నేనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఇన్నాల్లూ కళ్లునెత్తికెక్కించుకుని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు దారిన పడ్డాడు. 'వ్యవసాయం దండగ' అని అన్న వ్యక్తి నేడు అన్నదాతల కష్టాలు తీర్చాలంటూ నిరాహారదీక్ష చేస్తున్నాడు. కెసిఆర్‌లాగా ఒక్క రోజులో బిచాణా ఎత్తేసేందుకు ప్రయత్నించలేదు. సంతోషం. చంద్రబాబు మారాడా? మారితే మరీ మంచిది. ఇదే పద్ధతిలో ఎంత సేపు నిలబడతాడో వేచి చూడాల్సిందే...
బాబు ఏ పని చేసినా దాని వెనుక ఓ రెండు మూడు కారణాలుంటాయి. లక్ష్యాలు కూడా అన్నే ఉంటాయి. దీక్షలతో కూడా మనవాడు కుంభాన్ని కొట్టబోతున్నాడు. ఒకటి ఇన్నాళ్లూ పనీపాట లేని తెలుగు తమ్ముళ్లందరినీ 'రైతు' సమస్యలపై జనం దగ్గరికి వెళ్లేట్లు చేయగలిగాడు. జైతెలంగాణా, జై సమైక్యాంధ్ర నినాదాల రందిలో ఎటువైపు పోవాలో తెలియక తికమక పడుతున్న తమ్ముళ్లందరికీ నిజంగా రిలీఫే.. రెండోది కాంగ్రెస్‌ చీలిపోబోతోంది. జగన్‌ కొత్త పార్టీ పెడతానంటున్నాడు. ఆయన తన దగ్గరున్న డబ్బు చూసి విర్రవీగుతున్నాడు. వాళ్ల నాయన పేరును బ్రాండు ఇమేజీగా ప్రచారం చేసి గద్దె నెక్కాలనుకుంటున్నాడు. జగన్‌ చేసే ఏ ప్రయత్నమైనా కాంగ్రెస్‌ను చీల్చేయడం ఖాయం. అదే జరిగితే తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాంటేజీ తీసుకుని గద్దెనెక్కాల్సిందీ తెలుగుదేశమే. కాంగ్రేసోళ్లు వాళ్ల పంచాయతీలో పడి జనం సమస్యలను మరిచిపోయారని, కమ్యూనిస్టోళ్లలాగా తాను కూడా సమస్యలపై పోరాడుతున్నానని చెప్పుకునేందుకు ఈ దీక్షలు చంద్రబాబుకు పనికొస్తాయి. మూడోది ప్రత్యేక తెలంగాణా అంశం... ఓ వైపు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వబోతోంది. అదేం చెప్పినా రాష్ట్రం రావణకాష్టం కావడం ఖాయం. ఆ తరువాత జనం దగ్గరికి సమస్యలను, పార్టీని తీసుకుపోలేం. ఆ కమిటీ నివేదిక ఇచ్చేలోగానే ఇలాంటి కార్యక్రమం చేస్తే ఈ సమస్యా తీరిపోతుంది.
మొత్తానికి దీక్షలు చేపట్టాలనుకున్న బాబు నిర్ణయం రైట్‌ టైమ్‌లో రైట్‌ డెసిషన్‌ తీసుకున్నట్లుగా ఉంది. అయితే మళ్లీ చెబుతున్నా... చంద్రబాబు తాను తన మాట మీద ఎన్నాళ్లు నిలబడతాడు అన్నదానిపైనే ఫలితాలు ఉంటాయి.. వెయిట్‌ అండ్‌ సీ...

మన మిత్రుడొచ్చాడు

ఇది మూడేళ్ల క్రితం మాట. ఢిల్లీలో అంతర్జాతీయ ట్రేడ్‌ ఫెయిర్‌ జరిగింది. అందులో చైనా ఓ భాగస్వామి దేశం. స్టాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు అది అత్యధిక స్థలాన్ని తీసుకున్నది. అనేక స్టాల్స్‌ను పెట్టింది. భారీగా సరుకులను తీసుకొచ్చింది. మూడంటే మూడే రోజుల్లో వాటన్నింటినీ అమ్మేసింది. నాలుగో రోజు స్టాల్స్‌ అన్నీ ఖాళీ చేసి వెళ్లిపోయింది. అదే ఫెయిర్‌లో మనదేశ పారిశ్రామిక వేత్తలు కూడా పాల్గొన్నారు. స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయిలో సంసిద్ధం కాలేదు. చైనాలాగా పక్కా ప్రణాళికతో కూడా లేరు. మూడేళ్ల తరువాత ఇప్పుడు కూడా అలాంటిదే పునరావృతమైంది. 'మేము భాగస్వాములం, పోటీదార్లం మాత్రం కాము' అంటూ మన దేశానికి చైనా వచ్చింది. ఈ దఫా సరుకుల ఓడ రాలేదు. కానీ భారీ ఒప్పందాలను కుదుర్చుకునేందుకు పెద్ద విమానం నిండా 400 మంది వ్యాపార ప్రతినిధులు వచ్చారు. చైనా ప్రధాని వెన్‌ జియాబావో వారికి నేతృత్వం వహించారు. ఒక్క రోజులో 16 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 45 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒబామా(10బిలియన్‌ డాలర్లు), సర్కోజి(13బిలియన్‌ డాలర్ల) వాణిజ్య ఒప్పందాల రికార్డులను వీరు బద్దలు కొట్టారు. అయితే ఈ దఫా కూడా మన దేశీయ పెట్టుబడిదారులు పూర్తిస్థాయిలో సంసిద్ధం కాలేదు. వెన్‌ వచ్చినప్పుడు ఆయన్ను కలిసేందుకు టాటా రాలేదు. అంబానీ రాలేదు. సునీల్‌ మిట్టల్‌ రాలేదు. నారాయణమూర్తి కూడా లేడు. అయినా చైనీయులు తమ మొహం మీది చిరునవ్వును చెరగనీయలేదు. లక్ష్యం పట్ల విశ్వాసాన్నీ సడలనివ్వలేదు.