Friday, September 16, 2011

వడ్డీరేట్లు మళ్లీ పెరుగుతాయా?


ఈ వారం ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయి నుంచి కొద్దిగా తగ్గినప్పటికీ, ఆగస్టు నెలలో మొత్తం ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి పెరిగింది. అంతర్జాతీయంగా చూస్తే పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఆహార, ఆహారేతర సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రెండు శాతం కూడా తగ్గలేదు. అంతటా డిమాండ్‌కు తీవ్రమైన కొరత ఉందని చెబుతున్నప్పటికీ ముడి చమురు బ్యారెల్‌ ధర ఆకాశానికేసే పరిగెడుతోంది. బంగారం ధర కూడా కొత్త స్థాయిల్లోకి ఎగబాకుతోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు 2010 మార్చి నుంచి 2011 జులై దాకా ఆర్‌బిఐ 11 సార్లు కీలక రేట్లను సవరించింది. 325 బేసిస్‌ పాయింట్లు (3.25శాతం) పెంచింది. దీనివల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోగా పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా జూన్‌లో 6.6శాతం వృద్ధిరేటును నమోదు చేసుకున్న ఐఐపి, జులైలో 3.3శాతానికి పడిపోయింది. ఓ వైపు ఎగబాకుతున్న ద్రవ్యోల్బణం, మరోవైపు పడిపోతున్న పారిశ్రామికోత్పత్తి ఆర్‌బిఐని కత్తిమీద సాము చేయిస్తున్నాయి. శుక్రవారం నాడు జరగబోయే త్రైమాసిక మధ్యంతర ద్రవ్య సమీక్ష సందర్భంగా వడ్డీరేట్ల సవరణపై ఆర్‌బిఐ తన నిర్ణయాన్ని వెల్లడించబోతోంది.
వడీరేట్లు పెరిగితే ద్రవ్యోల్బణం తగ్గుతుందా?
మార్కెట్లో వస్తువులు, సేవలు, సరుకుల కంటే ద్రవ్యం అధికంగా ఉన్న స్థితిని ద్రవ్యోల్బణం అంటున్నారు. ద్రవ్య చలామణిని నియంత్రిస్తే సమతుల్యత ఏర్పడి ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావన. ఈ భావనతోనే ఆర్‌బిఐ గత 11 సార్లుగా 3.25శాతం కీలకరేట్లు పెంచింది. బ్యాంకుల్లో పోగుపడ్డ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయనీయకుండా రెపో, రివర్స్‌రెపో రేట్లను పెంచుతూ పోయింది. ఎప్పుడైతే కీలకరేట్లను సవరిస్తూ పోయిందో అప్పుడు పరిమిత వనరులతో తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు బ్యాంకులు అనివార్యంగా రుణాలపై వడ్డీని అధికంగా ఛార్జీ చేశాయి. వడ్డీరేట్లు పెరుగుతూ పోయాయి. దీంతో రుణాల పరపిణీ తగ్గుతుందని ఆర్‌బిఐ అంచనా వేసింది. ఇందుకు భిన్నంగా జనవరి నుంచి ఆగస్టు 26 నాటికి రుణాల పంపిణీ గత ఏడాదిస్థాయి రూ.34.54లక్షల కోట్ల నుంచి 41.70లక్షల కోట్లకు (20.78శాతం) పెరిగింది. డిపాజిట్లు కూడా 48.18లక్షల కోట్ల నుంచి 56.62లక్షల కోట్ల దాకా (17.5శాతం) పెరిగాయి. దీనిని బట్టి ఆర్‌బిఐ కీలక రేట్లను ఎంత సవరించినప్పటికీ ద్రవ్యచలామణికి మాత్రం ముకుతాడు వేయలేకపోయింది. ఇప్పుడైనా బాగా పెంచి (కనీసం 50 బేసిస్‌పాయింట్ల) ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని కొంత మంది నిపుణులు చెబుతున్నారు. అప్పుడే ధరలు తగ్గుతాయని వారు వాదిస్తున్నారు.
ద్రవ్యోల్బణం నిజ ధరల పెరుగుదల ఒక్కటేనా?
వారం వారం టోకుధరల సూచి, ఆహార ద్రవ్యోల్బణ సూచి ఫలితాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా సరుకుల ధరలను ఒక్కదగ్గర వేసి సగటు కట్టి ధరలు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? అని చెప్పే పద్ధతి ఇప్పుడు అమల్లో ఉంది. ఉల్లిగడ్డ ధర ఆంధ్రప్రదేశ్‌లో పెరిగి, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో తగ్గిపోతే ఉల్లిగడ్డ ధర తగ్గిందనే ప్రస్తుత సూచీలు చెబుతాయి. అప్పుడీ సూచీ ఫలితం ఆంధ్రప్రదేశ్‌లో తప్పవుతుంది. దేశవ్యాప్తంగా ఉండే సాధారణ ధోరణులను పరిశీలించడం వేరు, ఆయా ప్రాంతాల్లో నిర్దిష్టంగా కొన్ని సరుకులపై పెరిగిన ధరలను పరిశీలించడం వేరు. దీనికీ మార్కెట్లోని ద్రవ్యచలామణికి ఎలాంటి సంబంధం లేదు. 'సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తే వీటి ధరలు తగ్గిపోతాయి. ఉత్పత్తి, దేశీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఎగుమతి, దిగుమతి విధానాలపై ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకున్నా అనేక సరుకుల ధరలను అదుపులో పెట్టొచ్చు. ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ అనుకూల విధానాలను అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి సరుకుల ధరలను నిర్ణయించే ఈ కీలక దశల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిపోయింది. మార్కెట్‌ శక్తులకు వదిలేసింది. నిజ ధరలు పెరగడానికి ఇదే కారణమ'ని ఆర్థిక నిపుణులు సిపి చంద్రశేఖర్‌ చెబుతున్నారు.
వడ్డీరేట్ల పెంపు వల్ల నష్టపోయిందెవ్వరు?
అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా ధనిక దేశాల్లో రుణాలపై వడ్డీరేట్లు సున్నాస్థాయికి చేరాయి. ప్రతిగా అభివృద్ధి చెందుతున్న మన లాంటి దేశాల్లో వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. ఎంఎన్‌సీలకు, దేశంలోని బడా కార్పొరేట్లకు 3000కోట్ల డాలర్ల మేర విదేశీ వాణిజ్య రుణాలు (ఇసిబి) తెచ్చుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇవి విదేశాల నుంచి అతి తక్కువ ధరకు రుణాలు తెచ్చుకుని, ఇక్కడ అధిక రేట్ల వద్ద డిపాజిట్లు చేయడం ద్వారా విపరీతంగా లాభపడ్డాయి. ఎటొచ్చి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకే ఈ అవకాశం లేదు. వీరు దేశీయ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల నుంచి మాత్రమే రుణాలను పొందే అవకాశం ఉంది. అదీ అధిక వడ్డీరేట్ల మీద. సామాన్యులు సైతం తమ అవసరాలు తీర్చుకునేందుకు ఎక్కువ వడ్డీలకు రుణాలను తెచ్చుకోవాల్సి వచ్చింది. ఓ వైపు నిత్యావసర, అత్యవసర, ముడిసరుకుల ధరలు పెరగడం ద్వారా మార్కెట్లో అధికంగా వెచ్చించిన సాధారణ పౌరులు, అధిక వడ్డీరేట్ల రూపంలో రెండో మారు కూడా అధిక మొత్తాలను కోల్పోవాల్సి వచ్చింది. ధరలు అధికంగా ఉండడం వల్ల వ్యాట్‌రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధిక వడ్డీరేట్లు వసూలు చేయడం ద్వారా వాణిజ్య బ్యాంకులు ఈ కాలంలో విపరీతంగా ఆర్జించాయి.
ఆర్‌బిఐ ముందున్న అవకాశాలు
ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు ద్రవ్య సమీక్షను చేపట్టినా, కీలక రేట్లను సవరించినా దేశ జిడిపి వృద్ధి రేటు మీద కచ్చితమైన ప్రభావం ఉంటుందని ఆర్‌బిఐ ఎప్పుడూ చెబుతూనే ఉంది. వాస్తవానికి అది చెప్పినట్లే జరుగుతోంది. జిడిపి వృద్ధిరేటుపై అంచనాలు ఇప్పటికే ఒకశాతం తగ్గిపోయాయి. ప్రజలు మార్కెట్లో వెచ్చించే మొత్తాలు రెండు శాతం తగ్గిపోయాయి. పారిశ్రామికోత్పత్తి 3.3శాతం తగ్గిపోయింది. ఎగుమతి రంగం దెబ్బతిని దిగుమతులు భారీగా పెరిగిపోయి వాణిజ్యలోటు పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలని అది ప్రభుత్వానికి చెబుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఆర్‌బిఐపైనే భారాన్ని నెట్టింది. తాజాగా 'వడ్డీరేట్లు తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు టర్కీ, బ్రెజిల్‌ తరహా ప్రయోగాలు చేయాల'ని ప్రధాని ఆర్థిక సలహాదారు రంగరాజన్‌, ప్రభుత్వ ఆర్థికవేత్తలు రాహుల్‌ఖుల్లర్‌, కౌషిక్‌బసు ఉచిత సలహాలనిస్తున్నారు. ద్రవ్యోల్బణం పాపాన్ని అంతర్జాతీయ పరిస్థితుల మీద నెట్టి, విధాన పరంగా ప్రభుత్వం చేయాల్సిన పనిని కప్పిపెట్టి, ఇప్పుడు కూడా వడ్డీరేట్ల తగ్గింపు, పెంపుల గురించే మాట్లాడుతున్నారు. ఎవరేం చెప్పినా ద్రవ్యోల్బణం తాను నిర్దేశించుకన్న దానికంటే ఎక్కువే ఉండడంతో దానిని అదుపులో తెచ్చేందుకు 25 నుంచి 50 బేసిస్‌పాయింట్లు కీలకరేట్లను సవరించవచ్చు. లేదంటే సర్వత్రా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో తాత్కాలికంగా పెంపును వాయిదా వేయొచ్చు.
http://www.prajasakti.com/finance/article-271635

No comments:

Post a Comment