Monday, September 5, 2011

రామగుండం యూరియా ప్లాంటుకు మోక్షమెప్పుడో?

రామగుండం యూరియా ప్లాంటుకు ఇప్పుడిప్పుడే మోక్షం సిధ్దించేట్లు కనిపించడం లేదు. 1980 నుంచి 1999 వరకు సుమారు రెండు దశాబ్దాలు యూరియా ఉత్పత్తిలో ఒక వెలుగు వెలిగిన ఈ ప్లాంటు సరళీకృత ఆర్థిక విధానాలకు బలైపోయింది. మూతపడింది. 12ఏళ్ల తరువాత, దేశంలో డిమాండ్‌కు సరపడ యూరియా దొరకడంలేని ప్రస్తుత పరిస్థితుల్లో మన ఏలికలకు మళ్లీ ఈ ప్లాంటు స్ఫురణకు వచ్చింది. తెరుస్తామన్నారు. కేంద్ర కేబినెట్‌ ఆగస్టు నాలుగున ఇందుకు ఓకే కూడా చెప్పింది. రెండు వారాల క్రితం రాజ్యసభలో సంబంధిత మంత్రి కూడా దీనిని తెరుస్తున్నామన్నారు. ప్లాంటు తెరవడంపై ప్రకటనల మీద ప్రకటనలు వస్తున్నాయే కానీ ఇప్పటి వరకు ఎవరో ఒకరు వచ్చి తాళం కూడా తీసిన పాపాన పోలేదు.
ఇదీ ప్రస్తుత పరిస్థితి
ప్లాంటును పునరుద్ధరించాలని కేంద్రప్రభుత్వం ప్రకటించి నెల రోజులు గడిచినప్పటికీ తాళం తీయలేదు. దానికి కూడా తుప్పు పట్టి ఉంది. అంటే ఏ అధికారీ కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్లాంటులో చెక్‌రిపబ్లిక్‌, జర్మనీ, ఇటలీ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న టెక్నాలజీ, యంత్రాలు ఉన్నాయి. ఏప్రిల్‌ ఒకటి, 1999 నుంచి, అంటే దాదాపు 12ఏళ్లుగా ఇవేవీ పనిలో లేవు. వీటిని తిరిగి పనిలో పెట్టాలంటే కనీసం నాలుగు నెలలైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్లాంటు ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎఫ్‌సిఐఎల్‌) ఆధ్వర్యంలో నడుస్తోంది. దీని పునరుద్ధరణ పనుల గురించి కంపెనీ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేకాధికారి కె.ఎల్‌.రావుతో ప్రజాశక్తి సంప్రదించగా 'దీనిపై తనవద్ద సమాధానమేదీ లేద'ని చెప్పారు. యాజమాన్యం దీనిని తెరిచేందుకు కనీస ప్రయత్నం చేస్తున్నదా లేదా అనే విషయాలేమీ తెలియరాలేదు.
గ్యాస్‌పైప్‌లైన్‌ వస్తుందా? రాదా?
ఈ ప్లాంటును బొగ్గు ఆధారంగా కాకుండా గ్యాస్‌ ఆధారంగా నడపాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం గ్యాస్‌పైప్‌లైన్‌ వేస్తామని ప్రకటించింది. రెండ్రోజుల క్రితం స్థానిక ఎంపి పొన్నం ప్రభాకర్‌ సైతం గ్యాస్‌పైప్‌లైన్‌ నిర్మాణం గురించి స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు. పైప్‌లైన్‌ ప్లాంటు వద్దకు చేరుకునే సరికి నాలుగు నెలలు పడుతుందన్నారు. పైప్‌లైన్‌ పని హైదరాబాదు శివారులోని శామీర్‌పేట నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగుండం ప్లాంటు వరకు జరగాలి. అయితే పైప్‌లైన్‌ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించిన టెండర్లు కూడా ఖరారు కాలేదు. అంతెందుకు గ్యాస్‌ను ఎవరి వద్ద నుంచి సేకరించాలి? ఎక్కడి నుంచి సరఫరా చేయాలన్నది కూడా ఇంకా నిర్దారణ కాలేదు. స్థానికంగా దొరికే బొగ్గును కాకుండా, ఎప్పుడొస్తుందో తెలియని గ్యాస్‌ వచ్చిన తరువాత దీనిని పునరుద్ధరిస్తామని చెప్పడమంటే శాశ్వతంగా తాళం వేయడమేనని అధికారవర్గాలు చెబుతున్నాయి.
యూరియా అవసరాలు తీరేనా?
పెరుగుతున్న యూరియా డిమాండ్‌ అవసరాలను తీర్చేందుకే రామగుండం యూరియా ప్లాంటును తెరుస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 285లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, మన దేశంలో 218.80లక్షల టన్నుల యూరియానే ఉత్పత్తి అవుతోంది. మిగతాది దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనిని నివారించాలంటే రామగుండం సహా మూతేసిన మరో అయిదు ప్లాంట్లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయమైతే చేసింది గానీ, దాని అమలుకు మాత్రం చిత్తశు ద్ధితో ప్రయత్నించడం లేదని క్షేత్రాస్థాయి పరిశీలన స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది యూరియా ఉత్పత్తిని మరో నాలుగులక్షల టన్నుల మేర పెంచాలని ఇప్పటికే పరిశ్రమలకు లక్ష్యాలను కేటాయించింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా యూరియా ఉత్పత్తి పరిశ్రమలు లక్ష్యాలను అందుకోలేకపోయినా, దిగుమతులు సరిపడ రాకపోయినా గత ఆర్థిక సంవత్సరంలోలాగానే ఈ సారి కూడా రైతులు యూరియా కోసం రోడ్లమీద పడిగాపులు గాయాల్సిన దుస్థితి ఏర్పడనుంది. దీనిని నివారించాలంటే ప్రభుత్వ హయాంలో పనిచేసే రామగుండం యూరియా ప్లాంటును తక్షణం తెరవాల్సి వుందని అధికారులు చెబుతున్నారు.
 http://www.prajasakti.com/finance/article-268292

No comments:

Post a Comment