Saturday, September 3, 2011

ముమ్మాటికీ చట్ట విరుద్ధం


మానెసర్‌ ప్లాంటులో కార్మికులపై మారుతి సుజుకి యాజమాన్యం పలు రకాల నిర్బంధాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండింటి మధ్య నెలకొన్న స్తబ్ధత ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో పదవి నుంచి రిటైర్‌ అవుతున్న కార్మికశాఖ కార్యదర్శి పిసి చతుర్వేది మారుతి సుజుకి వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ సంస్థ చేస్తున్న పని ముమ్మాటికీ చట్ట విరుద్ధమైనదని ఆయన ప్రకటించారు.
ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ 'ఏదైనా ఒక కంపెనీ తన వద్ద పనిచేస్తున్న కార్మికులను బలవంతంగా బాండుపై సంతకాలు పెట్టించాలని ప్రయత్నించడం చట్టవిరుద్ధం. ఉద్యోగానికి సంబంధించిన అంశాలను స్వేచ్ఛగా చర్చించేందుకు కార్మికులకు అవకాశం ఉంది' అని ఆయన అన్నారు.
ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే మారుతి సుజుకి ఛైర్మన్‌ ఆర్‌సి భార్గవ తాము చేస్తున్నది చట్టబద్దమేనని ప్రకటించారు. హర్యానా ప్రభుత్వంతో యాజమాన్యం-యూనియన్‌ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కార్మికులను అలాంటి బాండు అడిగేందుకు తమకు చట్టబద్ధంగా హక్కుందని భార్గవ చెబుతున్నారు. '2001లో సైతం దీర్ఘకాలిక సమ్మె తరువాత కార్మికులను ఒక బాండు రాయాలని మేము అడిగాం. చట్టబద్దంగా ఉండి అది బాగా పనిచేసింది.' అని ఆయన అన్నారు.
హర్యానాకు సంబంధించిన పారిశ్రామిక ఉద్యోగాలు (స్టాండింగ్‌ ఆర్డర్స్‌) యాక్ట్‌-1946ను అనుసరించి 50 మంది కార్మికులకంటే ఎక్కువ మంది పనిచేస్తున్న కంపెనీల్లో యాజమాన్యం-యూనియన్‌ కలిసి పారిశ్రామిక సంబంధాలకు సంబంధించిన నియమనిబంధనలను ఖరారుచేయాల్సి ఉంటుంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంటుంది. మారుతీ దీనినే కీలకంగా చేసుకుని కార్మికులపై ఒత్తిడిని తీసుకువస్తోంది.
వాస్తవానికి మారుతీ సుజుకి కంపెనీలో ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న యూనియన్‌ను సైతం గుర్తించేందుకు అది నిరాకరిస్తోంది. అంతే కాదు సదరు యూనియన్‌కు గుర్తింపునివ్వకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అది లేఖ రాసింది. చట్ట ప్రకారం త్రైపాక్షిక ఒప్పందంలో యూనియన్‌కూడా ఉండాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు. మారుతీసుజుకి ప్లాంటు ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని అనుసరించి కార్మికచట్టాలపై కూడా యూనియన్‌ పాత్ర లేకుండా కంపెనీకి ఆ హక్కు బదలాయించబడింది. కంపెనీ ఏర్పాటు చేస్తున్నప్పుడు కార్మికుల హక్కులపై జరిగిన తొలిదాడి ఇది.
చట్టబద్దంగా బాండు రాయమనే హక్కు తనకుంది కాబట్టి దానినే అడుగుతున్నానని మారుతీ అంటోంది. ఇప్పటికే యూనియన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే పేరిట అనేక మందిని తొలగించిన మారుతి, మిగిలిన వారిపైనా వేధింపులకు పాల్పడుతోంది. బాండు మీద కేవలం 40 మందే సంతకాలు చేశారు. మిగిలినవారంతా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనను బేఖాతరు చేయాలని భావించిన మారుతీ తాజాగా ఐఐటి ట్రైనీలను ఈ కంపెనీలో తాత్కాలికంగా పనిచేయించేందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా ఉత్పత్తిని ప్రారంభిస్తానని చెబుతోంది. 'కార్మికులంతా కలిసి కావాలనే ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. కంపెనీ లక్ష్యాలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే బాండుపై సంతకం పెట్టాలని అడుగుతున్నాం' అని కంపెనీ యాజమాన్యం చెబుతుండగా ఇంకా గుర్తింపును పొందని ప్లాంటు యూనియన్‌ నేత శివకుమార్‌ దీనిని తీవ్రంగా ఖండించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీకి వ్యతిరేకంగా పనిచేయాలని కార్మికులెవ్వరూ అనుకోవడం లేదని, కార్మికులతో యాజమాన్యం సత్సంబంధాలను కలిగి ఉండాలని మాత్రమే తాము చెబుతున్నామన్నారు. ఇందుకోసం యూనియన్‌ను గుర్తించి, దానితో చర్చలు జరపాలని శివకుమార్‌ అన్నారు. మారుతి సుజుకి ప్లాంటులో కార్మికులకు, యాజమాన్యానికి మధ్య స్తబ్ధత నెలకొని పారిశ్రామిక సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కానీ ఇప్పటి దాకా అది స్పందించలేదు. కేంద్రం సైతం నేరుగా జోక్యం చేసుకునే అవకాశాలు కన్పించడంలేదు. ఈ విషయంపై పి.సి.చతుర్వేది స్పందిస్తూ 'ఇది రాష్ట్ర్రం పరిధిలోకి వస్తుంది. అక్కడే పరిష్కారానికి ప్రయత్నం జరగాలి. కేంద్రం జోక్యం చేసుకోవలంటే మమ్మల్ని ఎవరైనా సంప్రదించలేదు. ఇప్పటి వరకు ఎవ్వరూ మమ్మల్ని సంప్రదించనందున మేము జోక్యం చేసుకునే అవకాశం కూడా లేద'ని ఆయన అన్నారు.

No comments:

Post a Comment