Thursday, September 8, 2011

క్లినికల్‌ ట్రయల్స్‌పై స్వీయ నియంత్రణ





క్లినికల్‌ ట్రయల్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న సందర్భంలో తమకు తామే స్వీయ నియంత్రణ పద్ధతులను పాటిస్తామని క్లినికల్‌ పరిశోధనల సంస్థలు (సిఆర్‌ఒ) ప్రకటించాయి. మందుల ప్రయోగానికి సిద్ధపడ్డ వాలంటీర్ల పేర్లను ఎంపిక చేసే సమయంలో వీడియో, ఆడియో రికార్డుంగు కూడా చేస్తామని తెలిపాయి. ఒకే వాలంటీర్‌ వివిధ ప్రయోగాల్లో పాల్గొనకుండా నివారించేందుకు వాలంటీర్ల జాబితాను సంయుక్తంగా నిర్వహిస్తామని ప్రకటించాయి. జెనరిక్‌ డ్రగ్స్‌ను అభివృద్ధి చేసే క్రమంలో ప్రయోగాలపై పారదర్శకతను పాటించేందుకు ఇవి దోహదం చేస్తాయని సదరు సంస్థలు ప్రకటించాయి.
గత జూన్‌ నెలలో యాక్సిస్‌ క్లినికల్స్‌ లిమిటెడ్‌, అరబిందో ఫార్మా కంపెనీలు చట్ట విరుద్దంగా చేపట్టిన ప్రయోగాల ద్వారా అనేక మంది జబ్బుల బారిన పడిన విషయం తెలిసిందే. నిరక్షరాస్యులైన పేద వాలంటీర్లపై యాంటీ-క్యాన్సర్‌ డ్రగ్స్‌ను ప్రయోగించినప్పుడు సైడ్‌ ఎఫెక్ట్స్‌, ఇతర తీవ్రమైన జబ్బులు వచ్చాయని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిసిజిఐ) యాక్సిస్‌ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే స్వీయ నియంత్రణలను ఏర్పాటు చేసుకునేందుకు సిఆర్‌ఒలు ముందుకు వచ్చాయి.
రాష్ట్రంలో ఆరు కంపెనీలకు చెందిన 12 సిఆర్‌ఒ సంస్థలున్నాయి. ఇందులో సిప్రా ల్యాబ్‌ అయిజంట్‌, క్యూపిఎస్‌ బయో సర్వ్‌ ఇండియాలు సైతం స్వీయ నియంత్రణ ఫోరంలో చేరాయి. మిగిలిన సంస్థలు కూడా ఇందులో చేరే అవకాశం ఉందని వ్యాపార వర్గాల కథనం. జీవ సంబంధ క్లినికల్‌ ట్రయల్స్‌లో రాష్ట్రం వాటా 15 నుంచి 20శాతం దాకా ఉంది. దీని మార్కెట్‌ విలువ పదికోట్ల దాకా ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 40 సిఆర్‌ఒలున్నాయి.
'వ్యక్తులపై క్లినికల్‌ ప్రయోగాలు చేసే సమయంలో వీడియో, ఆడియో రికార్డింగ్‌ను చేపట్టాలని నిర్ణయించుకున్నామ'ని ఆక్సిస్‌ ల్యాబ్‌ ఎండి ఎం శరత్‌చంద్రా రెడ్డి అన్నారు. ప్రస్తుతం డిజిసిఐ రెండేళ్లకోసారి తమ మౌలిక వసతులు, ప్రయోగాలపై పర్యవేక్షణ చేస్తోందని, ఇకపై ప్రతి ఏడాదికి ఒక సారి పర్యవేక్షణ చేయాలని సిఆర్‌ఒ ఫోరం కోరుతుందని చెప్పారు. ఒక ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి ఎనిమిది నుంచి 12 ఏళ్ల సమయం పడుతుందని రా కెమ్‌ ఫార్మ సిఇఒ శిరీష్‌ కుమార్‌ అన్నారు. ఇందులో రూ.4,500 కోట్ల పెట్టుబడి పెట్టబడిందన్నారు. ఇప్పటి వరకు భారతీయ కంపెనీలు ఒక్క కొత్త ఔషధాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయాయని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
http://www.prajasakti.com/politicians/article-269156

No comments:

Post a Comment