Wednesday, September 7, 2011

'డ్రెడ్జింగ్‌'లో ఉపసంహరణకు నో

విశాఖపట్టణం కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డిసిఐ)లో పెట్టుబడుల ఉపసంహరణ కూడదని నౌకాయాన మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. ఇప్పటికే సంస్థ మార్కెట్‌ విలువ తక్కువగా ఉందని, మార్కెట్లో పరిస్థితులు కూడా బాగాలేవని, ఈ నేపథ్యంలో ఉపసంహరణ చేపడితే మొదటికే మోసం వస్తుందని అది అభ్యంతరం వ్యక్తం చేసింది.వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటి దాకా 22.5శాతం మేర వాటాలను ఉపసంహరించుకుంది. మరో 2.5శాతం ఉపసంహరించుకుని 25శాతానికి చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.40వేల కోట్లు సమీకరించాలనే ప్రయత్నానికి ఇది కూడా తోడవుతుందని ప్రభుత్వం భావన.
'2010-11లో డిసిఐ 39 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన మాట వాస్తవమే. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో డిసిఐ నికరలాభాలు గణనీయంగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో నికర లాభాలు 80శాతం మేర పడిపోయి రూ.3.02కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నికర లాభాలు రూ.15.76కోట్లుగా ఉంది. లాభాలు తగ్గిపోతున్నందున విలువ కూడా పడిపోతోంది.' అని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

స్వయం ప్రతిపత్తిని కల్పించకుండా, డిసిఐలో ప్రభుత్వ అనవసర జోక్యం పెరుగుతున్నందు వల్లే దాని లాభాలు తగ్గిపోతున్నాయని రవాణా, పర్యాటకం, సాంస్కృతిక అంశాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఇది వరకే నిర్దారించింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెట్టుబడులను ఉపసంహరించలేకపోతే లాభదాయక సంస్థ కాదనే పేరిట దీనిని ప్రయివేటీకరించేందుకు సైతం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని అధికారవర్గాల కథనం. డిసిఐని కొనుగోలు చేసేందుకు, దీనివద్ద ఉన్న అపారమైన మౌలిక వనరులను, సాధనాసంపత్తిని చేజిక్కించుకునేందుకు, డ్రెడ్జింగ్‌ పనిలో ఇప్పటికే ఉన్న కార్పొరేట్లు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు.

No comments:

Post a Comment